Monday 25 April 2011

గెలుపు - శ్వాస

మనం పంచుకోలేని ప్రత్యెక జీవితం లో
ముడిపడిన జ్ఞాపకాలను చేజార్చుకున్న క్షణాలను
ప్రతిరోజూ పేర్చుకోవడమే మిగిలింది
చూపులు కరువై మాటలు గతమై
చిరునవ్వులను చిదిమేసుకొని  అదిమేసుకున్న ప్రేమతో
నేను యాంత్రికంగా నిలబడితే ఆ గాయాలకు మందు లేని
ఒక శవం ఉచ్చ్వాస నిశ్వాసలె ఇవి
గుండె గుడిలో వెలిగే ప్రేమదీపం
పెళ్లి పందిరి వైపు దారి చూపలేకపోయింది
అయినా మనసు వాకిట్లో
ఇరవయ్యేళ్ళు గా పరుచుకున్న రంగవల్లులు
భద్రంగానే కొలువున్నాయి
ప్రియా !
నువ్వు లేక అర్ధం లేని ఈ భారమైన బ్రతుకు ఈదలేను
ఈ చిన్ని జీవితంలో ఈ శిక్ష కన్నా మృత్యుగీతం వినడమే నయం
కాని నువ్వున్న ఈ లోకాన్ని విడిచి ఏ లోకానికి చేరాలి ?
చదరంగం రెండువైపులా ఆట నీదే అయితే
అందులోనే నీకు సంతోషం ఉందనుకుంటే
అలిసిపోయి గాయపడ్డ ఒంటరి హృదయం
కచ్చితంగా నీ గెలుపునే కోరుకుంటుంది.

Monday 11 April 2011

చిన్నప్పటి  జ్ఞాపకాలు కొన్ని ఇంకా గుర్తునాయి. అమ్మమ్మ ఉన్నప్పటి రోజులే వేరు. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత అంటే చిన్నన్నయ్య తర్వాత మళ్ళీ మగపిల్లాడు పుట్టడంతో అందరు చాలా సంతోషించారు. కాని అష్టమి నాడు పుట్టడంతో మేనమామలకు ఏమైనా సమస్యలేమో అనుకున్నారు. అలాంటిదేమీ లేదు. విశ్వనాధం మామయ్య తొలిసారిగా వేరుపడ్డాక అరక తోలుకొని పోతుంటే ఉయ్యాలలో ఉన్న నేను తుమ్మానంట. అందరు బయపడ్డారు. కాని మామయ్య చాలా హాపీ గా ఉన్నాడు. అసలు అందరిలోకి ఆయనే చాలా క్లోజ్. బాడ్ లక్ అందరిలో ముందు ఆయనే పోయారు.

Wednesday 6 April 2011

అర్ధం గాని నుదుటి వ్రాత

ఇది  శ్రీను మొదటి బ్లాగ్. తన  ప్రపంచం లో  ఎదురైన అనుభవాలు, తగిలిన దెబ్బలు, నేర్చుకున్న పాఠాలు, సమాజం లో ఎవరితో ఎలా రిలేషన్స్ మెయింటేన్ చేయాలి ? ఇవన్ని ఇక్కడ పొందుపర్చుకుంటున్నాడు.    ఎవరికోసమో ఇది రాయట్లేదు. తన  కోసం తను అద్దం లో చూసుకొనే ప్రయత్నం .  వేసిన తప్పటడుగులు, తప్పుటడుగులు సమీక్షించుకొని ముందు ముందు ఎలా ఉండాలో తనకు తాను తెలియచేప్పుకోవదానికే.

అది 1969 అక్టోబర్ 3 శుక్ర వారం ఉదయం 8 .45  సత్యలోకం లో విరించి  చాలా బిజి గా తన కర్తవ్యం లో ఉన్నాడు  సరస్వతి దేవి కి ఈ అనంత కాల గమనం లో రవంతైనా విశ్రమించకుండా తన పని తానూ చేసుకుంటూ ఉన్న ఆ విధాత ను చూసి విసుగొచ్చింది. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లక కొన్ని యుగాలు గడిచాయి ఈ రొటీన్ పనిని కొద్ది సేపు వాయిదా వేసుకొని అలా వెళ్లి వద్దామంది. ఆయన కూడా సరే నన్నాడు. ఈ ఒక్కడి నుదుటి వ్రాత  రాసి వస్తా నన్నాడు. వచ్చాక రాయోచ్చు కదా అని దేవి అంది. భూమ్మీద ఒక జీవి పుట్టే సమయం ఆసన్నమైంది కాబట్టి వ్రాసి వస్తానన్నాడు. సరస్వతి దేవి కి కోపం తో విసా విసా సత్యలోకం నుంచి బయల్దేరింది. దేవి కోపాన్ని ఎలాగైనా తగ్గించి అలకను పోగొట్టాలని  ఆ జీవి నుదుటి మీద హడావిడి గా తనకే అర్ధం కాని విధం గా రాసి ఈ భూమ్మీదకు వదిలాడు.
ఆ విధంగా  ఆ బాలుడు ఖమ్మం మిషన్ హాస్పిటల్ లో పుట్టాడు. అతని రాత అర్డంగాని తల్లి దండ్రులు అతనికి మొదట పెట్టుకున్న పేరు రవి. ఆ తర్వాత అతని పేరు శ్రీను గా మారింది. కాలక్రమం లో అతనే మన ఫెయిల్యూర్ కధానాయకుడు.